Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థులు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘తల్లికి వందనం’ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. జూలై 22న ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఈ పథకం కింద రూ.10,120.78 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంది 67,47,190 విద్యార్థులకు సంబంధించిన 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను జమ చేయనున్నారు. అర్హులైన ఒక్కో విద్యార్థికి చెల్లించే రూ.15,000 నుంచి రూ.2,000 చొప్పున మినహాయించి, మిగతా 13000 జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం వర్తించనుంది. ఆధార్ తో అనుసంధానమైన విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు నగదు జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి ఖాతాకు, తండ్రి కూడా లేకపోతే గార్డియన్ ఖాతాల్లో వేస్తారు. తొలి విడత నిధులు 22 నుంచి 24 వరకు జమ అవుతాయి.
తొలివిడతగా 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తర్వాత 22వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అభ్యంతరాలు వినతులు స్వీకరిస్తారు. ఆ వినతులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలిస్తారు. అదేవిధంగా ఆగస్టు 25 వరకు ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు గడువు ఉంది. ఈ క్రమంలో కొత్త అడ్మిషన్లు, వినతులను పరిశీలించి ఆగస్టు 30వ తారీఖున రెండో విడత అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. అదే రోజున తల్లికి వందనం నగదును విడుదల చేస్తారు. మొత్తంగా 67,47,190 మంది వరకు విద్యార్థులకు ఈ పథకం నగదు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
Talliki Vandanam Eligibility Details
అర్హుల వివరాలు
- పట్టణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారి ఆదాయం రూ.12,000 మించకూడదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలవారి కుటుంబ ఆదాయం రూ.10,000 మించకూడదు.
- కుటుంబంలో కనీసం ఒక్కరైనా తెల్ల రేషన్ కార్డులో సభ్యులుగా ఉండాలి
- కుటుంబానికి మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట, రెండూ కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి.
- కుటుంబం నెలవారి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. దీనికి 12 నెలల సగటును లెక్కలోకి తీసుకుంటారు.
- కుటుంబానికి మున్సిపాలిటీలో 1,000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇల్లు, స్థలం ఉండకూడదు.
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటే ఈ పథకానికి అనర్హులు. టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది.
- ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు అనర్హులు
- కుటుంబ సభ్యులలో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నా ఈ పథకం వర్తించదు.
యాప్ లో అర్హుల జాబితా
తల్లికి వందనం పథకం కింద అర్హులైన వారి వివరాలను మన మిత్ర, లీప్ యాప్ లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. లబ్ధిదారులు తమ మొబైల్ లోనే లీప్ యాప్ ద్వారా తమ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఏపీ స్టేట్ పోర్టల్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లింక్ ద్వారా కూడా ఎలిజిబిలిటీ వివరాలు తెలుసుకోవచ్చు.

